ఇండోర్: రంజీట్రోఫీ క్వార్టర్ఫైనల్లో ఆంధ్రప్రదేశ్ జట్టు తొలి ఇన్నింగ్స్లో 172పరుగులకే కుప్పకూలింది. ఓవర్నైట్ స్కోర్ 9వికెట్ల నష్టానికి 234పరుగులవద్దే మధ్యప్రదేశ్ జట్టు చివరి వికెట్ను కోల్పోయింది. ఆంధ్ర బౌలర్లు శశికాంత్కు నాలుగు, నితీశ్ కుమార్కు మూడు వికెట్లు దక్కాయి. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన ఆంధ్ర బ్యాటర్స్ నిరాశపరిచారు. దీంతో మధ్యప్రదేశ్కు 62పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యత లభించింది. ఆంధ్రజట్టు కెప్టెన్ రికీ బురు(32), కరణ్ షిండే(38), షోయబ్(22), రేవంత్ రెడ్డి(22) మాత్రమే ఆశించిన స్థాయిలో రాణించారు. ఓపెనర్ ప్రశాంత్ కుమార్(0), అశ్విన్ హెబ్బర్(1), హనుమ విహారి(14) ఘోరంగా విఫలమయ్యారు. మధ్యప్రదేశ్ బౌలర్లు కార్తికేయ, అనుభవ్ అగర్వాల్కు మూడేసి, ఆవేశ్ఖాన్, కుల్వంత్కు రెండేసి వికెట్లు దక్కాయి. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన మధ్యప్రదేశ్ జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 21పరుగులు చేసింది. దీంతో మధ్యప్రదేశ్కు ఇప్పటికే 83పరుగుల ఆధిక్యత లభించింది. కర్ణాటకతో జరుగుతున్న క్వార్టర్ మ్యాచ్లో విదర్భ జట్టు తొలి ఇన్నింగ్స్లో 460పరుగులు చేయగా.. సౌరాష్ట్రపై తమిళనాడు జట్టు రెండోరోజు ఆట ముగిసే సమయానికి 6వికెట్ల నష్టానికి 300పరుగులు చేసింది. మరో క్వార్టర్స్లో ముంబయి జట్టు తొలి ఇన్నింగ్స్లో 384పరుగులకు ఆలౌట్ కాగా.. రెండోరోజు ఆట ముగిసే సమయానికి బరోడా జట్టు 2వికెట్లు నష్టపోయి 127పరుగులు చేసింది.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/02/anubhav-agarwal_MP.jpg)