ప్రాణాపాయం ఉంది.. రక్షించండి

డిఎస్‌పికి గరగపర్రు ఆత్మగౌరవ ఉద్యమ నాయకులు వెంకటరత్నం వినతి

ప్రజాశక్తి – పాలకోడేరు

గరగపర్రు దళితుల సాంఘిక బహిష్కరణ ఘటనకు కారకులైన ఇందుకూరి బలరామ కృష్ణంరాజుతో తనకు, తన కుటుంబ సభ్యులకు ప్రాణాపాయం ఉందని, తమకు రక్షణ కల్పించాలని గరగపర్రు ఆత్మగౌరవ ఉద్యమ నాయకులు సిరింగుల వెంకటరత్నం భీమవరం డిఎస్‌పి శ్రీనాథ్‌ను కోరారు. స్థానిక కలెక్టరేట్లో డిఎస్‌పి శ్రీనాథ్‌కు వినతిపత్రం అందజేసి మాట్లాడారు. 2007లో సాంఘిక బహిష్కరణకు గురికావడం జరిగిందని, దీనిలో బలరాంరాజు కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ప్రభుత్వం కేసు నమోదు చేసి దళితులకు రావాల్సిన నష్టపరిహారాన్ని అందించినట్లు తెలిపారు. అయితే బలరాంరాజు కేసు ఉపసంహరించుకోవాలని తనకు రాయబారాలు పంపుతున్నాడని, అంగీకరించకపోవడంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు. అలాగే కుటుంబ సభ్యులను సుపారీ ఇచ్చి హతమరుస్తానని భయబ్రాంతులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల కుటుంబంతో శుభకార్యానికి ఆకివీడు వెళ్లి తిరిగి వస్తుండగా తనపై దాడి చేయించారని ఆరోపించారు. బలరాంరాజుపై చట్టపరమైన చర్యలు తీసుకుని, తనను, కుటుంబ సభ్యులను రక్షించాలని డిఎస్‌పి శ్రీనాథ్‌ను కోరారు.

➡️