ప్రజాశక్తి – రాజమహేంద్రవరంరాజమహేంద్రవరం గ్రామీణం కాతేరులో తిరుమల విద్యాసంస్థల ప్రాంగణంలో ఆదివారం నిర్వహించిన అవగాహన సదస్సుకు విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి అనూహ్య స్పందన లభించిందని తిరుమల విద్యాసంస్థల ఛైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. ఈ సదస్సుకు సుమారు 14 వేల మంది హాజరయ్యారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా తిరుమలరావు మాట్లాడుతూ పిల్లలు వేసవి సెలవుల్లో కొంత సమయాన్ని విజ్ఞానాన్ని పెంపొందించుకొనేందుకు, కొంత సమయాన్ని ఆర్ట్స్, క్రాఫ్ట్స్ లాంటి వివిధ కళలను అభ్యసించటానికి కేటాయించి సద్వినియోగం చేసుకోవాలన్నారు. తమ పిల్లలు భవిష్యత్తులో ఐఐటి, ఎయిమ్స్ వంటి ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి కళాశాలల్లో విద్యనభ్యసించాలంటే స్కూల్ స్థాయి నుంచే ఐఐటి, మెడికల్ ఫౌండేషన్ అవసరంపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. విద్యాసంస్థల డైరెక్టర్ నున్న సరోజినీదేవి మాట్లాడుతూ పిల్లలు తమ తల్లిదండ్రులను అనుకరిస్తారని, తల్లిదండ్రులే వారికి రోల్ మోడల్లా ఉండాలని, ప్రతి తల్లీ తమ పిల్లలను సరైన మార్గంలో పెంచినట్లయితే సమాజమంతా ఒక కుటుంబంలా కలిసిమెలసి ఉంటుందని అన్నారు. ప్రస్తుత సమాజంలో పిల్లలు పుస్తకాలకన్నా ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్కు ఎక్కువగా అలవాటు పడ్డారని, వారికి పుస్తకాలతో కన్నా మొబైల్తో ఎక్కువ సమయం గడిపితే జరిగే నష్టం గురించి తల్లిదండ్రులు వివరించాలని తెలిపారు. ఈ సదస్సులో తిరుమల విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ జి.సతీష్ బాబు, ప్రిన్సిపల్ వి.శ్రీహరి, పూర్వ విద్యార్థుల తల్లిదండ్రులు కె.చలం, జి.వనజ, విద్యార్థులు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.