- వందమంది పైగా మృతి
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో భారీ వర్షాల కారణంగా 50మంది మరణించారని అధికారులు మంగళవారం తెలిపారు. అత్యవసర సేవల బృందాలన్నీ అప్రమత్తం చేసినట్లు చెప్పారు. మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో కూడా భారీ వర్షాల కారణంగా 50మంది చనిపోయారు. పాక్లోని ఖైబర్ ఫక్తువా ప్రావిన్స్లో ఎక్కువగా మరణాలు సంభవించాయి. ఇక్కడ మొత్తంగా 21మంది చనిపోయారు. రాజధాని ఇస్లామాబాద్ను భారీ వర్షాలు ముంచెత్తాయి. బలూచిస్తాన్ ప్రావిన్స్లో ఏడుగురు మరణించారు. పెషావర్, క్వెట్టాల్లో వీధుల్లో వరద నీరు పారుతోంది. బాధితులకు అవసరమైన సాయాన్ని అందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసినట్లు ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. దేశంలోని వాయవ్య ప్రాంతంలో అత్యవసర పరిస్థితి విధించినట్లు అధికారులు తెలిపారు. భారీ వర్షాలు, వరదల కారణంగా కొండచరియలు విరిగిపడ్డాయి. డజన్ల సంఖ్యలో ఇళ్ళు నేలమట్టమయ్యాయి.
మరోవైపు ఆఫ్ఘనిస్తాన్లో కూడా భారీ వర్షాలకు 50మంది మరణించగా, 36మంది గాయపడ్డారు. 600కి పైగా గృహాలు ధ్వంసమయ్యాయి. 200కి పైగా ప శువులు మరణించాయి. వరదలకారణంగా వందల కిలోమీటర్ల మేరా రోడ్లు దెబ్బతిన్నాయి. దాదాపు 23వేల కుటుంబాలకు ప్రభుత్వం ఆశ్రయం కల్పించింది. మొత్తంగా 34 ప్రావిన్స్ల్లో 20ప్రావిన్స్లు వరదలకు దెబ్బతిన్నాయి.