న్యూయార్క్ : భారత్లో ఎన్నికలు స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్లు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ప్రతినిధి స్టిఫేన్ డుజారిక్ తెలిపారు. రానున్న లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భారత్లో రాజకీయ అనిశ్చితి గురించి ఓ విలేకరి స్టీఫెన్ను ప్రశ్నించారు. ఆయన ఈ ప్రశ్నకు సమాధానంగా.. ‘భారత్లో అయినా, మరో దేశంలో అయినా ఎన్నికలు జరిగితే అక్కడ ప్రజల రాజకీయ, పౌర హక్కుల్ని రక్షించాల్సి ఉంటుంది. ప్రతి ఒక్కరూ కూడా స్వేచ్ఛగా, న్యాయబద్ధంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలి.’ అని ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, ఇటీవల ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఐటి శాఖ సీజ్ చేయడం లాంటి అంశాలపై అగ్రరాజ్యం అమెరికా, జర్మనీ స్పందించాయి. ఈ నేపథ్యంలో ఆ దేశాలపై భారత్ విదేశాంగ శాఖ మండిపడింది. భారత్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోకూడదని హెచ్చరించింది.