న్యూఢిల్లీ : లోక్సభ ఎన్నికలకు తొలిసారి ఓ థర్డ్ జెండర్ వ్యక్తి నామినేషన్ దాఖలు చేశాడు. ఇతని పేరు రాజన్ సింగ్ (26). దక్షిణ ఢిల్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఇతను శుక్రవారం నామినేషన్ వేశాడు. రాజన్ సింగ్కు లక్ష రూపాయల నగదు, 200 గ్రాముల బంగారం, సుమారు రూ. 15.10 లక్షల చరాస్తులున్నట్లు తన అఫడవిట్లో ప్రకటించాడు. తనకు ఎలాంటి స్థిరాస్తులు లేవని రాజన్ పేర్కొన్నాడు. తాను 2010లో బీహార్ నుంచి వలస వచ్చి ఢిల్లీలోని సంగమ్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్నట్లు రాజన్ తెలిపాడు. థర్డ్ జెండర్ వ్యక్తులకు ప్రత్యేక సౌకర్యాలు లేవు. దేశంలో హక్కుల కోసం వారు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రజలతోపాటు అధికారుల దృష్టిని ఆకర్షించేందుకు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు రాజన్ చెప్పాడు. విద్యా, ఉద్యోగాల్లో థర్డ్ జెండర్లకు ఒక శాతం రిజర్వేషన్లు కల్పించడంతోపాటు, జాతీయ ట్రాన్స్ జెండర్ కమిషన్ను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశాడు. తాను ఎన్నికల్లో గెలిస్తే థర్డ్ జెండర్లకు సంబంధించిన సమస్యల్ని పరిష్కరిస్తానని మీడియాతో అన్నాడు. ఈ నియోజకవర్గానికి మే 25న పోలింగ్ జరగనుంది.