- న్యాయ విద్యార్థులకే రక్షణ లేకుంటే ఎలా ? : హైకోర్టు వ్యాఖ్య
అహ్మదాబాద్ : గుజరాత్ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం (జిఎన్ఎల్యు) ప్రాంగణంలో వేధింపులు, అత్యాచారాలు, స్వలింగ సంపర్కం, వివక్ష వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఇవేవో ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు కావు. గుజరాత్ హైకోర్టు నియమించిన నిజ నిర్ధారణ కమిటీ గత వారం న్యాయస్థానానికి సమర్పించిన నివేదికలోని చేదునిజాలు. ఈ నివేదిక ‘నిజంగా భయానకం’గా ఉన్నదని హైకోర్టు వ్యాఖ్యానించింది. ఈ దారుణాలకు జిఎన్ఎల్యుయే బాధ్యత వహించాలని ప్రధాన న్యాయమూర్తి సునీతా అగర్వాల్, న్యాయమూర్తి అనిరుద్ధ మయీతో కూడిన బెంచ్ స్పష్టం చేసింది. అకృత్యాలపై గళం విప్పకుండా విద్యార్థుల గొంతుకను వర్సిటీ యాజమాన్యం అణచివేస్తోందని మండిపడింది. జిఎన్ఎల్యూలో చదువుతున్న ఓ విద్యార్థినిపై లైంగికదాడి జరిగిందని, మరో విద్యార్థినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సామాజిక మాధ్యమాలలో వచ్చిన వార్తలపై మీడియాలో కథనాలు వెలువడ్డాయి. వీటిని సుమోటోగా స్వీకరించిన న్యాయస్థానం మాజీ న్యాయమూర్తి హర్షా దేవాని నేతృత్వంలో నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. యూనివర్సిటీపై వచ్చిన వార్తలను వర్సిటీకి చెందిన ఆంతరంగిక ఫిర్యాదుల కమిటీ (ఐసిసి), రిజిస్ట్రార్ అంతకుముందు తోసిపుచ్చారు. ‘ఇది జాతీయ న్యాయ యూనివర్సిటీ ఎలా అవుతుంది? ఏమీ జరగలేదని, విచారణను నిలిపివేశామని రిజిస్ట్రార్ ఓ అఫిడవిట్ సమర్పించారు. ఇలాంటి వ్యక్తులు పిల్లలను ఎలా రక్షిస్తారు?’ అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. వర్సిటీ ప్రాంగణంలో అత్యాచారం, లైంగిక వేధింపులకు సంబంధించి రెండు సంఘటనలు మాత్రమే జరగలేదని, అనేక ఇతర దారుణాలు కూడా చోటుచేసుకున్నాయని బెంచ్ అభిప్రాయపడింది. విద్యార్థుల ఫిర్యాదులను వర్సిటీ అధికారులు బుట్టదాఖలు చేశారని నిజనిర్ధారణ కమిటీ తేల్చిందని తెలిపింది. పైగా విద్యార్థులు తమ సమస్యలను సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేయడాన్ని నేరంగా వారు పరిగణించారు. ఇలాంటి పోస్టుల వల్ల వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుందని భావించారు. న్యాయాన్ని రక్షించాల్సిన లా విద్యార్థులకే ఇలా జరిగితే ఎలా అని న్యాయస్థానం ప్రశ్నించింది. కేసు తదుపరి విచారణను మార్చి 12వ తేదీకి వాయిదా వేసింది.