పాట్నా : దేశవ్యాప్తంగా శుక్రవారం తొలిదశ ఓటింగ్ 21 రాష్ట్రాల్లో జరిగింది. ఈ రాష్ట్రాల్లో బీహార్ రాష్ట్రంలోనే అతి తక్కువ ఓటింగ్ నమోదయింది. ఓటింగ్ ముగిసే సమయానికి 48.23 శాతం పోలింగ్ నమోదైందని హెచ్ఆర్. శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధి పనులు, ఇతర సమస్యల్ని కారణంగా చూపిస్తూ ఏడు పోలింగ్ బూత్లలో ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. అందులో నాలుగు పోలింగ్ బూత్లు ఔరంగబాద్లో (నెంబర్ 97,65, 42, 43), నవాడలోని (8, 137 నంబర్లు) బూత్లు ఉన్నాయి. అలాగే ఓటర్లకు బూత్లు దూరంగా ఏర్పాటు చేయడం వల్ల కూడా ఓటర్లు ఓటింగ్కి దూరమయ్యారని శ్రీనివాస్ తెలిపారు. మరోవైపు రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవ్వడం వల్ల కూడా పోలింగ్ శాతం తగ్గి ఉండొచ్చని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. పట్నా వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం బీహార్ రాష్ట్రంలో ఔరంగాబాద్లో అత్యధికంగా 42.2 డిగ్రీల సెలియస్, గయలో 42.1 డిగ్రీల సెల్సియస్, నవాడలో 42 డిగ్రీల సెల్సియస్, జముయిలో 41.8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
![](https://prajasakti.com/wp-content/uploads/2024/04/bihar-4.jpg)