న్యూఢిల్లీ / గాజా : ప్రపంచ ప్రజాభిప్రాయాన్ని బేఖాతరు చేస్తూ గాజాలో మారణ హౌమాన్ని సృష్టిస్తున్న ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుతో ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ఫోన్లో సంభాషించారు. ఈ విషయాన్ని ప్రధాని కార్యాలయం (పిఎంఓ) మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. సముద్రంలో నౌకాయాన భద్రతపైనా వీరిరువురు చర్చించినట్లు ప్రధాని కార్యాలయం తెలిపింది. యుద్ధ ఖైదీలను విడుదల, యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించాల్సిన ఆవశ్యకత గురించి ప్రధాన మంత్రి మోడీ, నెతన్యాహుకు చెప్పారని ఆ ప్రకటన తెలిపింది. .”భారత్ నుంచి ఇజ్రాయెల్కు కార్మికులను పంపే ప్రతిపాదన గురించి మోడీ ప్రస్తావించినట్లు పిఎంఓ తెలిపింది. అశాంతి వాతావరణంలో, థారులాండ్ వంటి వివిధ దేశాలు తమ పౌరుల భద్రతను పరిగణనలోకి తీసుకుని గాజా నుంచి ఖాళీ చేయిస్తున్నాయి. దీంతో ఇజ్రాయెల్లో కార్మిక శక్తి తగ్గిపోతోంది. ఈ స్థితిలో ఇజ్రాయెల్ కార్మికులను పంపేందుకు మోడీ ప్రభుత్వం సిద్ధమైంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఈ వారం కాల్పుల విరమణపై ఓటు వేయవచ్చు. గతంలో అమెరికా ఈ ప్రతిపాదనను వీటో చేయడం ద్వారా అడ్డుకుంది. పాలస్తీనా భూభాగమైన గాజాను ఇజ్రాయెల్ సైన్యం ధ్వంసం చేసింది. సోమవారం రాత్రి నుంచి నిరంతర వైమానిక దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల్ ట్యాంకులు గాజాలోకి ప్రవేశించి విచక్షణారహితంగా కాల్పులు జరుపుతున్నాయి. ఇజ్రాయిల్ దాష్టీకాలకు వ్యతిరేకంగా ప్రపంచవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. రఫాపై ఇజ్రాయెల్ భీకర దాడులుదక్షిణ గాజాలోని రఫా పట్టణంపై ఇజ్రాయెల్ యుద్ధోన్మాదంతో విరుచుకుపడుతోంది. శరణార్థి శిబిరాలు, ఆస్పత్రుల సమీపంలోనూ అమానవీయంగా దాడులు చేస్తోంది. తాజా ఘటనలో 29 మంది ప్రాణాలు కోల్పోయారు. మతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారు.