ఇంఫాల్ : మణిపూర్లో ఆదివారం మరోసారి కాల్పులు చోటుచేసుకున్నాయి. మణిపూర్లోని ఇంఫాల్ పశ్చిమ జిల్లాలో ఆదివారం ఉదయం కుకీ, మొయితీ వర్గాలకు చెందిన వాలంటీర్ల మధ్య కాల్పులు జరిగినట్లు పోలీసులు తెలిపారు. కాంగ్పోక్పీ జిల్లాల్లోని కౌత్రుక్ గ్రామంపై కొండపై నుండి సాయుధ దుండగులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని అన్నారు. కొన్ని బుల్లెట్లు గ్రామస్తుల ఇళ్లను నాశనం చేశాయని అన్నారు. పిల్లలు, మహిళలు, వృద్ధులను సమీపంలోని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నట్లు తెలిపారు. స్థానికంగా తయారయ్యే పంపి అని పిలిచే మోర్టార్ షెల్స్ను గ్రామంపై ప్రయోగిస్తున్నారని పోలీసులు తెలిపారు. అయితే ఈ కాల్పుల్లో ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ఆ ప్రాంతంలో భారీగా భద్రతా బలగాలను మోహరించారు.
ఈనెల 26న ఇంఫాల్ తూర్పు సరిహద్దులోని సినామ్ కోమ్ గ్రామంలో రెండు గ్రూపుల మధ్య కాల్పులు జరిగాయని, ఈ ప్రమాదంలో 33 ఏళ్ల గ్రామ వాలంటీర్ మృతి చెందాడు.