ప్రపంచంలోనే అతిపెద్ద ఎన్నికల ప్రక్రియను భారత ఎన్నికల కమిషన్ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అత్యున్నత ప్రమాణాలతో చేపట్టే ఈ ఎన్నికలను వాటి పారదర్శకతను ప్రత్యేక్షంగా సందర్శించేందుకుగాను అంతర్జాతీయ ఎన్నికల సందర్శకుల కార్యక్రమాన్ని (ఐఇవిపి) చేపట్టింది. దీనిలో భాగంగా 23 దేశాలకు చెందిన 75 మంది ఎన్నికల నిర్వహణా సిబ్బంది మన దేశానికి వస్తున్నట్లు ఇసి తెలిపింది. భూటాన్, మంగోలియా, ఆస్ట్రేలియా, మడగాస్కర్, ఫిజి, కిర్గిజ్ రిపబ్లిక్, రష్యా ,మాల్డోవా, టునీషియా, షీషెల్స్, కంబోడియా, నేపాల్, ఫిలిఫ్పైన్స్, శ్రీలంక, జింబాబ్వే, బంగ్లాదేశ్, కజికిస్తాన్, జార్జియా, చిలీ, ఉజ్బెకిస్తాన్, మాల్దీవులు, పుపువా న్యూగినియా, నమీబియా వంటి దేశాల నుంచి ఎన్నికల సిబ్బంది మన దేశ ఎన్నికలను పరిశీలించనున్నారు. భూటాన్, ఇజ్రాయిల్ దేశాల మీడియా బృందాలు పాల్గొననున్నాయి. మహారాష్ట్ర, గోవా, గుజరాత్, కర్ణాటక, మద్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో వారి బృందాలు పర్యటిస్తాయి. ఈ కార్యక్రమం మే9న ముగుస్తుందని ఇసి వెల్లడించింది.