న్యూఢిల్లీ : తన సినిమా థియేటర్లో పనిచేసిన ఉద్యోగులకు ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ చెల్లించని కేసుకు సంబంధించి సీనియర్ నటి జయప్రదకు విధించిన 6 నెలల జైలు శిక్షను సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేస్తూ … జస్టిస్ అభయ్ ఓకా, ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది. థియేటర్ యాజమాన్యం రూ. 9 లక్షల 80 వేలను ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ కింద జమ చేయడంతో కోర్టు శిక్షను రద్దు చేసింది. చెన్నైలోని జయప్రదకు చెందిన సినీ థియేటర్లో జయప్రద, ఆమె ఇద్దరు సోదరులు వాటాదారులుగా ఉన్నారు. ఈ థియేటర్ 10 ఏళ్ల క్రితమే మూతపడింది. అయితే ఈ థియేటర్లో పనిచేసిన ఉద్యోగుల జీతాల నుంచి ఈఎస్ఐ పేరుతో కోతలు విధించి తమ వద్ద జమ చేయలేదని ఈఎస్ఐకార్పొరేషన్ (ఈఎస్ఐసీ) కేసు పెట్టింది. ఈ కేసును విచారించిన చెన్నైలోని మెట్రోపాలిటన్ కోర్టు గత ఏడాది ఆగస్టులో జయప్రదకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అనంతరం ఈ కేసులో ఆమె అప్పీల్కు వెళ్లగా సుప్రీం కోర్టులో ఊరట లభించింది. అయితే థియేటర్ యాజమాన్యం రూ. 9 లక్షల 80 వేలను ఈఎస్ఐ కంట్రిబ్యూషన్ కింద జమ చేయడంతో జయప్రదకు విధించిన 6 నెలల జైలు శిక్షను కోర్టు రద్దు చేసింది.