న్యూఢిల్లీ : బీమా కొరెగావ్ హింస కేసులో యుఎపిఎ కింద అభియోగాలు మోపిన గౌతమ్ నవ్లఖాకు బాంబే హైకోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలపై సుప్రీం మంగళవారం స్టే ఎత్తివేసింది. నవ్లఖా ఇప్పటికే జైల్లో నాలుగేళ్లకు పైగా గడిపారని, ఆయన 70వ పడిలో వున్నారని, ఆయన విచారణకు ఏళ్లు పట్టే అవకాశం వుందని జస్టిస్ ఎం.ఎం.సుందరేశ్ నేతృత్వంలోని బెంచ్ పేర్కొంది. యుఎపిఎ కింద ఆయన తీవ్రవాద చర్యలకు పాల్పడ్డారని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఎ) చెబుతున్న వాదనలకు రుజువులు లేవని బెంచ్ పేర్కొంది. ఆయన బెయిల్పై సుప్రీంలో సవాలు చేయడానికి ఎన్ఐఎ కొంత గడువు కోరడంతో మూడు వారాల పాటు బెయిల్ అమలును నిలిపివేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీర్ఘకాలంగా జైల్లో వుండడం వల్ల ఆయన అస్వస్థతతో బాధపడుతున్నారని మంగళవారం సీనియర్ న్యాయవాది నిత్యా రామకృష్ణన్ చెప్పారు. ఇప్పటికే గృహ నిర్బంధం ఖర్చుల కింద రూ.2.4 లక్షలు చెల్లించారని తెలిపారు.