న్యూఢిల్లీ : రాజస్థాన్లోని అజ్మీర్లో ఓ ఇమామ్ను ముగ్గురు దుండగులు దారుణంగా హత్య చేశారు. శనివారం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రామ్గంజ్లోని కంచన్ నగర్లో ఉన్న మసీదులో మొహమ్మద్ మహిర్ (30) ఆరుగురు పిల్లలతో కలిసి నిద్రిస్తుండగా, కర్రలతో వచ్చిన ముగ్గురు దుండగులు తీవ్రంగా కొట్టారు. వారు ముసుగులు ధరించి ఉన్నారని, ఇమామ్తో పాటు నిద్రిస్తున్న బాలురిని బెదిరించారని పోలీసులు తెలిపారు. మొబైల్ ఫోన్ కూడా తీసుకుని పరారయ్యారని ఆయన చెప్పారు. తర్వాత బాలురు పొరుగువారికి సమాచారం అందించడంతో అతనిని ఆస్పతికి తరలించగా, అప్పటికే మరణించినట్లు తెలిపారు. మహమ్మద్ మహిర్ ఉత్తరప్రదేశ్లోని రామ్పురా ప్రాంతానికి చెందిన వాడని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామని, నిందితుల కోసం గాలిస్తున్నామని తెలిపారు.