- బీహార్ సభలో ప్రధాని మోడీ
దర్బంగా : ఎస్సి, ఎస్టిల రిజర్వేషన్లను దోచుకోవడానికి ఇండియా కూటమి పార్టీలు ప్రయత్నిస్తున్నాయని ప్రధాని నరేంద్రమోడీ ఆరోపించారు. ఉత్తర బీహార్లోని దర్భంగాలో శనివారం జరిగిన ఎన్నికల సభలో ఆయన ప్రసంగించారు. గోద్రా రైలు దహనం కేసులో నిందితులను రక్షించడానికి సోనియా పాలనలో లాలూ ప్రసాద్ యాదవ్ ప్రయత్నించారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు ఎప్పుడూ ”బుజ్జగింపు” రాజకీయాలు చేస్తున్నాయని ఆరోపించారు. ”ఇండియా బ్లాక్ ముస్లింలకు రిజర్వేషన్లను మళ్లించడానికి ప్రయత్నిస్తోంది. వారు అంబేద్కర్, తొలి ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూ అభిప్రాయాలకు విరుద్ధంగా ఉన్నారు, వారిద్దరూ మతపరమైన రిజర్వేషన్లకు అనుకూలంగా లేరు” అని అన్నారు. ఢిల్లీలో ఒక యువరాజు, పాట్నాలో ఒక యువరాజు ఉన్నారని, వారు దేశాన్ని తమ జాగీర్గా భావిస్తారని అన్నారు. సర్జికల్ స్ట్రైక్స్కు సంబంధించి, సాయుధ బలగాలకు సంబంధించి చెడుగా మాట్లాడినప్పుడే వారి మనస్తత్వం బహిర్గతమైందని చెప్పారు.