ఖగారియా : ప్రజా సమస్యలపై నిరంతరం పనిచేసే సిపిఎం అభ్యర్థిని గెలిపించాలని ఇండియా వేదిక నాయకులు పిలుపునిచ్చారు. బీహార్లోని ఖగారియా పార్లమెంట్ నియోజకవర్గ సిపిఎం అభ్యర్థి సంజరుకుమార్ నామినేషన్ దాఖలు చేసిన అనంతరం సోమవారం ఖగారియాలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. వేలాదిమంది సిపిఎం కార్యకర్తలు, సానుభూతిపరులు, ఇండియా వేదిక కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. సభలో ఆర్జెడి నేత తేజస్వీ యాదవ్, సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు డాక్టర్ అశోక్ ధావలే, ఆర్జెడి నేత మనోహర్ యాదవ్, కాంగ్రెస్ నేత ఛత్రపతి సింగ్, సిపిఐ నేత ఓం ప్రకాష్ నారాయణ్, సిపిఐ (ఎంఎల్) నాయకుడు ఉమేష్ సింగ్, పలువురు స్థానిక ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు.