వనపర్తి (శ్రీకాకుళం) : ఉన్నత విద్యాభ్యాసం కోసం అమెరికాకు వెళ్లిన ఇద్దరు తెలుగు విద్యార్థులు శనివారం రాత్రి వారున్న గదిలోనే మృతి చెందారు. వీరిలో ఒకరు వనపర్తికి చెందిన విద్యార్థి కాగా, మరొకరు ఎపిలోని శ్రీకాకుళం జిల్లాకు చెందినవారని తెలిసింది.
వనపర్తి పట్టణంలోని రాంనగర్కాలనీకి చెందిన గట్టు వెంకన్న, లావణ్య దంపతుల ఏకైక కుమారుడు దినేశ్ (23) బీటెక్ చదివారు. అమెరికాలోని కనెక్టికట్ రాష్ట్రం ఫెయిర్ ఫీల్డ్లోని సేక్రెడ్ హార్ట్ విశ్వవిద్యాలయం (ఎస్హెచ్యూ)లో ఎంఎస్ చదివేందుకు గత ఏడాది డిసెంబరు 28న బయలుదేరారు. 17 రోజులకే తమ కుమారుడు నిద్రలోనే చనిపోయినట్లు సమాచారం అందిందని బాధిత తల్లిదండ్రులు తెలిపారు. ఇతనితోపాటు శ్రీకాకుళం జిల్లా విద్యార్థి కూడా చనిపోయాడని తెలిసిందన్నారు. ఒకే గదిలో ఉన్న ఇద్దరు విద్యార్థులు నిద్రలోనే విగతజీవులుగా మారడంపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషవాయువు పీల్చడంతో చనిపోయి ఉండొచ్చని అక్కడి నుంచి సమాచారం వచ్చినట్లు తెలిపారు. వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి బాధిత కుటుంబాన్ని పరామర్శించి.. వివరాలు తెలుసుకున్నారు. సిఎం రేవంత్రెడ్డితో మాట్లాడి మఅతదేహాన్ని అమెరికా నుంచి వనపర్తికి రప్పించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. బాధితులను మాజీ మంత్రి నిరంజన్రెడ్డి పరామర్శించారు.