– కేంద్ర పర్యావరణశాఖకు ఎన్జిటి ఆదేశం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో:రాష్ట్రంలో ఇసుక అక్రమ తవ్వకాలపై ఎన్జిటి ఆగ్రహించింది. సామాజిక కార్యకర్త దండా నాగేంద్ర దాఖలు చేసిన పిటిషన్పౖౖె విచారణ జరిపి రాష్ట్రంలో ఇసుక తవ్వకాలు నిలిపేయాలని గతంలో ఎన్జిటి ఆదేశించింది. ఎపిలో అక్రమ మైనింగ్పై బుధవారం ఎన్జిటికి కేంద్ర అటవీ, పర్యావరణ అటవీశాఖ కమిటీ నివేదిక ఇచ్చింది. పర్యావరణ అనుమతులు లేకుండా రాష్ట్రంలో ఇంకా భారీగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నట్లు నివేదికలో కేంద్ర కమిటీ నిర్ధారించింది. ఫొటోలతో పాటు ఇతర సాక్ష్యాధారాలతో నివేదికను ఎన్జిటికి కేంద్ర కమిటీ అందజేసింది. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయని పేర్కొంది. ఎలాంటి అనుమతులు లేకుండా 24 గంటలూ తవ్వకాలు చేపడుతున్నారని, ఒక్కో రీచ్లో రోజుకు రెండు వేల టన్నుల మేర తవ్వకాలు కొనసాగుతున్నాయని వెల్లడించింది. శాటిలైట్ చిత్రాల ద్వారా తవ్వకాల ఆధారాలు సేకరించామని వివరించింది. ఎలాంటి ఇసిలు లేకుండా తవ్వకాలు చేస్తున్నారని తెలిపింది. గతంలో ఎన్జిటి ఇచ్చిన ఆదేశాలు అమలు కావట్లేదని పేర్కొంది.కేంద్ర కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని కేంద్ర పర్యావరణ అటవీశాఖకు ఎన్జిటి ఆదేశాలు జారీ చేసింది. ఈ అంశంలో కలెక్టర్ల నివేదిక, కేంద్ర మంత్రిత్వశాఖ నివేదిక పూర్తి భిన్నంగా ఉన్నాయని పేర్కొంది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ జరుగుతోందని, ఏం చేయాలనేది న్యాయస్థానమే తేలుస్తుందని స్పష్టం చేసింది. నివేదికను సర్వోన్నత న్యాయస్థానానికి అందజేస్తామని తెలిపింది.గతంలో ఇసుక అక్రమాలపై జెపి పవర్ వెంచర్స్కు రూ.18 కోట్లు తాత్కాలికంగా ఎన్జిటి జరిమానా విధించింది. మొత్తం ఎన్ని రీచ్లలో అక్రమ మైనింగ్ జరుగుతుందో తేల్చాలని కమిటీని కూడా నియమించింది. అక్రమాలు జరిగినట్లు నివేదికలో వెల్లడైతే ప్రతి రీచ్కు కోటి రూపాయల చొప్పున జరిమానా చెల్లించాలని కూడా ఎన్జిటి ఆదేశించింది.రాష్ట్రంలో 40 రీచ్లలో మాన్యువల్ మైనింగ్కు ఇసి అనుమతులుంటే 500లకు పైగా రీచ్లలో ఇసి అనుమతులు లేకుండా యంత్రాలతో ఇసుక మైనింగ్ చేస్తున్నట్లు కేంద్ర కమిటీ నివేదికలో పేర్కొంది. కేంద్ర కమిటీ నివేదిక ప్రకారం.. జెపి పవర్ వెంచర్ కంపెనీ రూ.500 కోట్లకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఎన్జిటి అభిప్రాయపడింది. గతంలో ఎన్జిటి ఆదేశాలను జెపి పవర్ వెంచర్స్ సుప్రీంలో సవాలు చేసింది. ఎన్జిటి విధించిన జరిమానాను నిలిపివేసేందుకు సుప్రీంకోర్టు షరతులు విధించింది. మైనింగ్ను వెంటనే నిలిపివేయడమే కాకుండా అసలు ఎంతమేరకు అక్రమ మైనింగ్ జరిగిందో కేంద్ర కమిటీ ద్వారా నిగ్గు తేల్చాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంతవరకూ ఎన్జిటి విధించిన జరిమానాపై తాత్కాలికంగా సుప్రీంకోర్టు స్టే విధించింది.గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను సుప్రీంలో సవాలు చేసినందున ఇసుక మైనింగ్ అక్రమాలపై కేంద్ర పర్యావరణ, అటవీశాఖ కమిటీ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాలని బుధవారం నాడు ఎన్జిటి ఆదేశించింది. తమ ఆదేశాలను కూడా ఎపి ప్రభుత్వం ఖాతరు చేయడం లేదని కేంద్ర కమిటీ నివేదిక ద్వారా స్పష్టమవుతోందని ఎన్జిటి తెలిపింది. సుప్రీంకోర్టే రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక అక్రమ మైనింగ్పై తుది నిర్ణయం తీసుకుంటుందని, కేసును సుప్రీంకు ఎన్జిటి రిఫర్ చేసింది. వచ్చే వారం సుప్రీంకోర్టులో ఎపి ఇసుక అక్రమ తవ్వకాలపై విచారణ జరిగే అవకాశం ఉంది.