ఓటమి శాశ్వతం కాదు.. కష్టపడితే గెలుపు మనదే : హరీశ్‌రావు

Feb 2,2024 16:10 #Harish Rao, #speech

యాదాద్రి భువనగిరి : ఓటమి శాశ్వతం కాదు. గెలుపునకు నాంది. బీఆర్‌ఎస్‌కు ఇది స్పీడ్‌ బ్రేకర్‌ మాత్రమేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. శుక్రవారం భువనగిరి అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల సమావేశంలో ఎమ్మెల్యే జగదీష్‌రెడ్డితో కలిసి పాల్గన్నారు. ఈ సందర్భంగా హరీశ్‌ రావు మాట్లాడుతూ..ఓడిపోయిన నియోజకవర్గం సభలో పట్టనంతమంది రావడం మన బలానికి చిహ్నం అన్నారు.ఎన్నికల హామీలను నిలబెట్టుకోని కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని ప్రజలు గమనిస్తున్నారు. ప్రచారంలో అబద్ధాలు మాట్లాడిన కాంగ్రెస్‌ పార్టీపై అధికారంలోకి వచ్చాక ప్రజల్లో అసహనం పెరిగిందన్నారు. రైతుబంధు పడడం లేదని, జెడ్పీ చైర్మన్‌గా బాధ్యతతో సందీప్‌ రెడ్డి అడిగితే ఆయనను పోలీసులతో బయటికి పంపించారని ఆరోపించారు. మరి ఫిబ్రవరి 1న గ్రూప్‌ 1 నోటిఫికేషన్‌ ఎందుకివ్వలేదో జవాబు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇచ్చిన హామీలను కాంగ్రెస్‌ అమలు చేయడం లేదు. ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి విస్తఅతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు సూచించారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడి పోరాడి సత్తా చూపిద్దామన్నారు. అధికారపక్షమైనా, ప్రతిపక్షమైనా మనం ప్రజల పక్షం ఉందామన్నారు.

➡️