హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు నాయకులు భారీగా పోటీ పడుతున్నారు. ఆశావహుల నుంచి దరఖాస్తుల స్వీకరణ గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. మొత్తం 306 అప్లికేషన్లు వచ్చాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. చివరి రోజు కావడంతో.. ఇవాళ ఒక్కరోజే 166 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం నుంచి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సతీమణి నందిని, భువనగిరి నుంచి పీసీసీ ఉపాధ్యక్షురాలు బండ్రు శోభారాణి, సికింద్రాబాద్ సీటు కోసం డాక్టర్ రవీందర్ గౌడ్, వేణుగోపాల్ స్వామి, పెద్దపల్లి నుంచి గడ్డం వివేక్ కుమారుడు గడ్డం వంశీ, వరంగల్ నుంచి మోత్కుపల్లి నర్సింహులు, మహబూబాబాద్ నుంచి విజయాబారు తదితరులు దరఖాస్తు చేసిన వారిలో ఉన్నారు.