– ఏప్రిల్ మొదటి వారంలో తుక్కుగూడలో బహిరంగ సభ
– హాజరుకానున్న రాహుల్, ఖర్గే
ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో:అధికార కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రం నుంచే దేశ వ్యాప్త ఎన్నికల శంఖారావాన్ని పూరించనుంది. ఏప్రిల్ మొదటి వారంలో రంగారెడ్డి జిల్లా తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. పార్లమెంటు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత కాంగ్రెస్ ఏర్పాటు చేస్తున్న మొదటి సభ ఇదే కావడంతో ఆ పార్టీ దాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అదే వేదిక నుంచి తన మేనిఫెస్టోను విడుదల చేయనుంది. ఇప్పటికే దేశ ప్రజల కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన ఆరు గ్యారంటీల భరోసా ఇవ్వనుంది. ఈ సభకు ఎఐసిసి అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేత రాహుల్గాంధీతోపాటు పార్టీ సీనియర్ నాయకులు హాజరుకానున్నారు. అందుకు సంబంధించిన కసరత్తును సిఎం రేవంత్రెడ్డి ప్రారంభించినట్టు తెలిసింది. తుక్కుగూడలో నిర్వహించే సభకు రాష్ట్ర నలుమూలల నుంచి భారీ జనసమీకరణకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే రంగారెడ్డి జిల్లా నాయకులతో రేవంత్ మాట్లాడినట్టు తెలిసింది. కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు ఈ సభకు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని ఆయన ఆదేశించారు. ఎన్నికల సమరంలో అత్యధిక సీట్లలో గెలుపే లక్ష్యంగా పని చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సభను విజయవంతం చేయడానికి నేతలు కష్టపడి పని చేయాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రులు తుక్కుగూడ మైదానాన్ని సందర్శించారు.