ప్రజాశక్తి – తిరుమల : తిరుమల శ్రీవారి దర్శనానికి జూన్ నెలకు సంబంధించి ఆన్లైన్లో ఆర్జితసేవా టికెట్లు, శ్రీవారి సేవ టికెట్లను టిటిడి విడుదల చేసింది. ఈ నెల 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల లక్కీడిప్ కోసం ఆన్లైన్లో నమోదు చేసుకోవచ్చు. మార్చి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోపు సొమ్ము చెల్లించి టికెట్లు ఖరారు చేసుకోవాల్సి ఉంటుంది. 21వ తేదీ ఉదయం 10 గంటలకు శ్రీవారి ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్ల కోటాను విడుదల చేస్తారు. జూన్ 19 నుండి 21వ తేదీ వరకు జరగనున్న జ్యేష్టాభిషేకం ఉత్సవంలో సందర్శకులు పాల్గొనేందుకు మార్చి 21న ఉదయం 10 గంటలకు, శ్రీవారి వర్చువల్ సేవలైన కల్యాణోత్సవం, ఊంజల్సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లు, దర్శన టికెట్ల అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు కోటాను అందుబాటులో ఉంచుతారు. 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణం టోకెన్లు, 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దాతల దర్శనం, గదుల కోటా, మధ్యాహ్నం 3 గంటలకు వృద్ధులు, దివ్యాంగుల దర్శన టికెట్ల కోటాను విడుదల చేస్తారు. 25న ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టకెట్లను, మధ్యాహ్నం 3 గంటలకు తిరుమలలోని గదుల కోటాను విడుదల చేయనున్నారు. 27న ఉదయం 11 గంటలకు తిరుమల, తిరుపతిలోని శ్రీవారి సేవ కోటాను, మధ్యాహ్నం 12 గంటలకు నవనీత సేవ కోటాను, పరకామణి సేవ కోటాను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతారు.