– వైసిపి రీజనల్ కోఆర్డినేటర్ విజయసాయిరెడ్డి
– మేదరమెట్ల ‘సిద్ధం’ సభ పోస్టర్, ప్రచార పాట ఆవిష్కరణ
ప్రజాశక్తి-ఒంగోలు సబర్బన్ : బాపట్ల జిల్లా మేదరమెట్లలో ఈ నెల 10న నిర్వహించనున్న సిద్ధం సభలో మేనిఫెస్టోను విడుదల చేస్తామని వైసిపి రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వి.విజయసాయిరెడ్డి తెలిపారు. ఐదు సంవత్సరాలలో చేపట్టబోయే అభివృద్ధి పనులను ఈ మేనిఫెస్టోలో పొందుపర్చుతామని చెప్పారు. ఒంగోలులోని ఓ ఫంక్షన్ హాల్లో సిద్ధం సభ సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా సిద్ధం సభ పోస్టర్ను, ప్రచార పాటను విడుదల చేశారు. అనంతరం విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మేదరమెట్లలో నిర్వహించే సిద్ధం సభకు తిరుపతి, నెల్లూరు, బాపట్ల, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి సుమారు 15 లక్షల మంది హాజరవుతారని అంచనావేస్తున్నామని తెలిపారు. రానున్న ఐదేళ్లలో ప్రజలకు మరింత మంచి పాలన ఏ విధంగా అందిస్తామన్న దానిపై, మేనిఫెస్టోలో యే అంశాలు పొందుపరిచామన్న విషయాలను సిఎం జగన్మోహన్రెడ్డి వెల్లడిస్తారని తెలిపారు. మార్చి 13, 14 తేదీల్లో ఎన్నికల ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ కోఆర్డినేటర్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మంత్రులు మేరుగు నాగార్జున, ఆదిమూలపు సురేష్, కాకాని గోవర్ధనరెడ్డి, అంబటి రాంబాబు, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.