అమరావతి : ఎపిలో పోలీసుల తనిఖీల్లో 14 కోట్ల విలువైన 66 కేజీల బంగారాన్ని ఆదివారం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ-హైదరాబాద్ వెళ్లే జాతీయ రహదారి ఎన్హెచ్-65పై కంచికచర్ల మండలం పేరకలపాడు గ్రామం వద్ద ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న బివిసి లాజిస్టిక్స్ వాహనాన్ని తనిఖీ చేయగా సుమారు14 కోట్లు విలువైన 66 కేజీల బంగారు వెండి ఆభరణాలను పట్టుకున్నారు.
బివిసి లాజిస్టిక్ వాహనంలో విజయవాడలోని మలబార్, కళ్యాణ్, లలిత తదితర జ్యువెలరీ దుకాణాలకు అందజేసేందుకు వెళ్తున్నట్లు సమాచారం. ఆదాయ పన్ను, జిఎస్టి అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. పట్టుబడిన 66 కేజీల 740 గ్రాముల బంగారు, వెండి ఆభరణాల విలువ రూ. 14,11,99,897గా బిల్లులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. విజయవాడ ఎయిర్పోర్ట్లో కార్గో సేవలు లేకపోవడంతో, హైదరాబాదు నుంచి రోడ్డు ద్వారా వెండి బంగారు ఆభరణాలను బివిసి లాజిస్టిక్స్ ద్వారా ద్వారా విజయవాడ తరలిస్తున్నారు.