ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని దోచేశారు : బాలకృష్ణ

May 4,2024 22:56 #2024 election, #Balakrishna, #TDP

ప్రజాశక్తి – యలమంచిలి (అనకాపల్లి) : ‘ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు.. అందరి నడ్డి విరిచారు. ప్రశ్నించేవాడిని నోరెత్తకుండా చేశారు… యువతను గంజాయికి బానిసలను చేశారు.. ఆస్తులు కాజేశారు.. భూములు దోచుకోవడం వంటి చర్యలకు పాల్పడి రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించారు’ అంటూ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందబూరి బాలకృష్ణ సిఎం జగన్‌ను ఉద్దేశించి విమర్శించారు. అనకాపల్లి జిల్లా యలమంచిలి మున్సిపాలిటీ దిమిలి జంక్షన్‌లో శనివారం స్వర్ణాంధ్ర సాకార యాత్ర పేరుతో చేపట్టిన ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. జగన్‌, బొత్స, సుబ్బారెడ్డి, సాయిరెడ్డితో కూడిన దుష్టచతుష్టయానికి తీసిపోని రీతిలో మైనింగ్‌, భూముల ఆక్రమణ, దౌర్జన్యాలతో ఆరితేరిన ఎమ్మెల్యే కన్నబాబురాజును ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. చిన్నప్పటి నుంచీ నోరు తెరిస్తే జగన్‌ అబద్ధాలే మాట్లాడుతున్నారని ఆయన చెల్లెలే విమర్శిస్తున్నారని తెలిపారు. రాష్ట్రాభివృద్ధికి టిడిపిని అధికారంలోకి తీసుకురావడానికి కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. తొలుత బాలకృష్ణ అనకాపల్లి నుంచి జాతీయ రహదారి మీదుగా యలమంచిలి మున్సిపాల్టీ వరకూ రోడ్‌షో నిర్వహించారు. ఆయన వెంట టిడిపి సీనియర్‌ నాయకులు పప్పల చలపతిరావు, ప్రగడ నాగేశ్వరరావు, జనసేన యలమంచిలి ఎమ్మెల్యే అభ్యర్థి సుందరపు విజయకుమార్‌ ఉన్నారు.

➡️