ప్రజాశక్తి-మధురవాడ (విశాఖపట్నం) : ప్రజల భాగస్వామ్యం లేనిదే ఏ దేశమైనా ఆర్థికంగా వృద్ధి చెందలేదని కేంద్ర ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ఈ దృష్టితోనే 2047 నాటికి ‘వికసిత భారత్’ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని తెలిపారు. గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయంలో ఆ సంస్థ అధ్యక్షులు ఎం శ్రీభరత్ అధ్యక్షతన సోమవారం ‘వికసిత భారత్ క్యాంపస్ అంబాసిడర్’ కార్యాక్రమానికి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 1991లోనే ఆర్థిక సంస్కరణలు అమలైనప్పటికీ అవినీతి, నాయకత్వ లేమి కారణంగా అనుకున్నంత అభివృద్ధి సాధించలేకపోయామన్నారు. ప్రధాని మోడీ నాయకత్వంలో పదేళ్లలో గణనీయమైన ప్రగతి సాధించామని ఆమె చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో గీతం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ దయానంద సిద్దవట్టం, ప్రో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ గౌతమరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గుణశేఖరన్ పాల్గొన్నారు.