ప్రజాశక్తి – తిరుమల : తిరుమల రెండో ఘాట్రోడ్డులో పెను ప్రమాదం తృటిలో తప్పింది. వినాయక స్వామి ఆలయం దాటిన తరువాత యాత్రికులతో వెళుతున్న ఆర్టిసి బస్సు అదుపుతప్పి ఓ మలుపు వద్ద ఒక్కసారిగా ఎడమ వైపుకు తిరిగి రిటైనింగ్ వాల్ను ఢీ కొట్టింది. దీంతో, బస్సు ముందు రెండు టైర్లు లోయలోకి వేలాడాయి. అప్రమత్తమైన డ్రైవర్ చాకచక్యంగా బస్సును రోడ్డుకు అడ్డంగా నిలిపేశారు. యాత్రికులు వెంటనే బస్సులోనుంచి కిందకు దిగేశారు. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలూ కాలేదు. ఈ ప్రమాదంలో బస్సులోని డీజిల్ మొత్తం రోడ్డుపై పడడంతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. సమాచారం అందుకున్న టిటిడి విజిలెన్స్, ఆర్టిసి అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదంపై విచారణ చేపట్టారు. ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉంది.