- స్టూడెంట్ కిట్లపై విద్యాశాఖ ఆదేశాలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందించే ‘స్టూడెంట్ కిట్’ (విద్యా కానుక)లో ఉన్న వస్తువులపై రాజకీయపరమైన ఏ నాయకుని పేర్లు, చిత్రాలు, లోగోలు ముద్రించకుండా సరఫరా చేయాలని సమగ్రశిక్షా డైరెక్టర్ బి శ్రీనివాస్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు పున:ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కిట్లు పంపిణీ చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రెండురోజుల క్రితం నిర్వహించిన సమీక్షలో ఆదేశాలిచ్చారని తెలిపారు. ఈ మేరకు గురువారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. కిట్ నాణ్యతలను తరువాత పరిశీలిస్తామని, లోపాలుంటే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి సూచించారని వెల్లడించారు. పాత స్టాకును సరఫరా చేయకూడదని స్పష్టమైన ఆదేశాలిచ్చామని పేర్కొన్నారు. ఆదేశాలు అతిక్రమిస్తే సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.