పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు సిఎం నడుచుకుంటున్నారు : ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి

శింగనమల : ” మాట తప్పను.. మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారు. ” అని అనంతపురం జిల్లా శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆరోపించారు. సోమవారం పద్మావతి సోషల్‌ మీడియా వేదికగా ఓ వీడియోను పోస్టు చేశారు. ఎమ్మెల్యేగా ఏమీ చేయలేకపోయానని.. శింగనమల నియోజకవర్గ ప్రజలు తనను క్షమించాలని కోరారు.

వచ్చే ఎన్నికల్లో టికెట్‌ కేటాయింపుపై పద్మావతి మాట్లాడుతూ …మాట తప్పను.. మడమ తిప్పను అన్న ముఖ్యమంత్రి.. ప్రస్తుతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చెప్పినట్లు నడుచుకుంటున్నారని ఆరోపించారు. తనతోపాటు తన భర్త పట్ల మంత్రి వివక్ష చూపారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్‌ కేటాయించడం లేదని సిఎం చెప్పారనీ, టికెట్‌ ఇవ్వాలని ముఖ్యమంత్రిని అభ్యర్థించినప్పటికీ… అటువైపు నుంచి ఏ మాత్రం స్పందన లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు. శింగనమల చెరువుకు నీరు తెచ్చుకోవాలంటే యుద్ధం చేయాల్సి వస్తోందని అన్నారు. నీటికోసం ఎన్నిసార్లు అధికారులను అడిగినా స్పందించిన దాఖలాలు లేవు అని చెప్పారు. వరదలొస్తే నీళ్లు ఇస్తారా ? ఎస్సీ నియోజకవర్గమంటే అంత చిన్న చూపా ? ఒక కులం, ఒక నియోజకవర్గానికే అన్నీ సమకూరుస్తారా ? నీటి కోసం ఎన్నేళ్లు ఇలా పోరాటం చేయాలి ? దీనిపై ప్రశ్నిస్తే నేరంగా భావిస్తారా ? అని ధ్వజమెత్తారు. ”ఐదేళ్లలో ఒకసారి కంటితుడుపుగా నీళ్లు ఇస్తే సరిపోతుందా ? అందరూ కలిసిరండి.. నీటి కోసం పోరాడదాం” అని ఎమ్మెల్యే పద్మావతి పిలుపునిచ్చారు.

➡️