- ఉద్యోగుల ధర్నా
ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్ : బిఎస్ఎన్ఎల్ను నీరుగార్చేందుకు కేంద్రం ప్రభుత్వం కుట్ర చేస్తోందని, సంస్థను పరిరక్షించాలని డిమాండ్ చేస్తూ బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం శ్రీకాకుళం సంచార భవన్ వద్ద ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాతల గోవర్థనరావు, పోలాకి వెంకటరావు మాట్లాడుతూ కార్పొరేట్, ప్రయివేటు కంపెనీలు దేశవ్యాప్తంగా 5జి సేవలతో పెద్దఎత్తున వ్యాపారాభివృద్ధిని పెంచుకుంటున్నా, బిఎస్ఎన్ఎల్ యాజమాన్యం మాత్రం నాలుగేళ్లుగా అందుబాటులోకి తెచ్చిన 4జి సేవలను విస్తృతం చేయడంలేదని విమర్శించారు. వినియోగదారులకు పూర్తిస్థాయిలో సేవలందించే సామర్థ్యం ఉన్నా అందించకపోవడంతో ప్రతినెలా లక్షలాది కనెక్షన్లు జియో, ఎయిర్టెల్ ఇతర సంస్థలకు వెళ్తున్నాయని తెలిపారు. బిఎస్ఎన్ఎల్ సంస్థకు 4జి, 5జి సేవలు అందించేందుకు అవసరమైన యాంత్రీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. లేకుంటే రానున్న రోజుల్లో ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియన్ నాయకులు అభిమన్యు, లక్ష్మి, అరుణ, చరణ్, ఢిల్లీశ్వరరావు, శ్రీను తదితరులు పాల్గొన్నారు.