ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : సిపిఎం అభిమాని ధూళిపాళ్ల వెంకటేశ్వరరావు (92) అనారోగ్యంతో శుక్రవారం కన్నుమూశారు. విజయవాడ కస్తూరిబాయిపేటలోని తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. సిపిఎం అగ్రనేతలు పుచ్చలపల్లి సుందరయ్య, లావు బాల గంగాధరరావుకు ఆయన ప్రియ శిష్యులుగా ఉన్నారు. ఎమర్జెన్సీ సమయంలో రహస్య జీవితం గడిపారు. లావు గంగాధరరావుకు వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు నగరంలోని రామలింగేశ్వరనగర్ శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటేశ్వరరావు భౌతికకాయాన్ని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సిహెచ్.బాబూరావు సందర్శించి నివాళులర్పించారు. ధూళిపాళ్ల మృతికి సంతాపం తెలిపి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. భౌతికకాయాన్ని సిపిఎం నాయకులు కాజ సరోజ, వి.గురుమూర్తి, పి.శ్రీనివాస్ తదితరులు సందర్శించి నివాళులర్పించారు.