ప్రజాశక్తి – ఎస్వియు క్యాంపస్ : ఎపి ఆర్సెట్ 2023-24 ప్రవేశ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. మే రెండు నుంచి ఐదు వరకూ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఎపి ఆర్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ బి. దేవప్రసాదరాజు తెలిపారు. తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు. వచ్చే రెండు నుంచి ప్రతి రోజూ ఉదయం తొమ్మిది నుంచి 11 గంటల వరకూ, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంకాలం 4.30 గంటల వరకూ రెండు దశలుగా పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి వెబ్సైట్లో వచ్చే పదో తేదీ నుంచి విద్యార్ధులు హాల్ టికెట్లు డౌన్లోడ్లు చేసుకోవాలని సూచించారు. హైదరాబాద్తో పాటు రాష్ట్రంలోని ఎంపిక చేసిన 17 కేంద్రాల్లో ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు చెప్పారు. మే 20 నాటికి ఫలితాలు వెల్లడించి, జూన్లో ఇంటర్వ్యూలు చేపడతామని వివరించారు. ఈ సమావేశంలో ప్రొఫెసర్ కుసుమ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.