తెలంగాణ : ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత వేటు వేయాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో రాజు యాదవ్ అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీపై గెలుపొందిన దానం.. ప్రస్తుతం ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్ పార్టీలో ఆయన చేరినట్లు పిటిషన్ లో రాజు యాదవ్ తెలిపారు. ప్రస్తుతం సికింద్రాబాద్ ఎంపి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరపున దానం నాగేందర్ పోటీ చేస్తున్నారు. అయితే, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి రాజీనామా చేయకుండా మరో పార్టీ నుంచి ఎంపిగా దానం నాగేందర్ పోటీ చేయడం చట్ట విరుద్ధమని.. ఇది రాజ్యాంగ విరుద్ధం అని పిటిషనర్ రాజు యాదవ్ పిటిషన్లో పేర్కొన్నారు. వెంటనే దానం నాగేందర్ పై స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చర్యలు తీసుకోవాలని కోరారు. దానంపై అనర్హత వేటు వేయాల్సిందిగా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది.