.హైదరాబాద్ : హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఎస్.బాలకృష్ణ అరెస్టయ్యారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఆయనను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై బుధవారం ఏసీబీ అధికారులు హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ ఇళ్లు, ఆఫీసులపై దాడులు నిర్వహించారు. ఏకకాలంలో 17 చోట్ల సోదాలు జరిపారు. అయితే ఏసీబీ దాడుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఏసీబీ సోదాల్లో రూ.100 కోట్ల అక్రమ ఆస్తులను అధికారులు గుర్తించారు. హైదరాబాద్ శివారులో భారీగా భూములను ఏసీబీ అధికారులు గుర్తించారు. హైదరాబాద్ చుట్టుపక్కల 100 ఎకరాల భూపత్రాలను అధికారులు సీజ్ చేశారు. 80కి పైగా ఖరీదైన వాచీలు, 18 ఐ ఫోన్లు, కల్వకుర్తిలో 26 ఎకరాలు, జనగామలో 24 ఎకరాలు, యాదాద్రిలో 23, కొడకండ్లలో 17 ఎకరాల పత్రాలను అధికారులు సీజ్ చేశారు. నిన్న ఏసీబీ అధికారులు రెండు కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. కాసేపట్లో శివ బాలకృష్ణకు వైద్య పరీక్షలు చేయించనున్నారు. అనంతరం ఆయనను కోర్టులో పోలీసులు హాజరు పరచనున్నారు. రెండో రోజు ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. నేడు బ్యాంకు లాకర్లను ఏసీబీ అధికారులు తెరవనున్నారు.