ప్రజాశక్తి -తిరుమల : వేసవి తాపం నుంచి ఉపశమనం కలిగేలా తిరుమలలో భారీ వర్షం కురిసింది. దాదాపు 42 డిగ్రీలు ఉన్న ఉష్ణోగ్రతలు వరుణుని రాకతో 20 డిగ్రీలకు తగ్గుముఖం పట్టింది. తిరుమలలో వాతావరణం చల్లబడగా ఉదయం నుంచి తన ప్రభావాన్ని చూసిన సూర్యుడు శుక్రవారం మధ్యాహ్నం వేళకు వేడి నుంచి భారీ ఈదురు గాలులతో కూడిన వర్షంతో ఉపశమనం కలిగింది. వేసవి కాలంలో కురిసే వర్షం కావడంతో వడగండ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురి అయిన వేసవిలో ప్రకతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదించారు. తిరుమలలో రోడ్లు అన్ని వర్షపు నీటితో నిండి పోయాయి. భారీగా కురిసిన వర్షానికి నాలుగు మాఢ వీధులు జలమయం కాగా స్వామి వారి దర్శనానికి వెళ్ళిన భక్తులు, స్వామి వారి దర్శనం అనంతరం బయటకు వచ్చిన భక్తులు వర్షానికి తడిచి ముద్ద అయ్యారు. అకాల వర్షంతో తిరుమలలో వాతావరణం మరింత చల్లగా ఆహ్లాదకరంగా ఉండడంతో భక్తులు చల్లదనాన్ని ఎంజాయ్ చేసారు.