హింసా రాజకీయాల్లో జగన్ ని మించిపోయారు 

Mar 25,2024 12:57 #Atchannaidu, #TDP, #YCP Govt
atchannaidu on ycp govt

వైసీపీ మూకలపై  అచ్చెన్నాయుడు
పెదకూరపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గం
వైసీపీ ఆగడాలు నచ్చక పార్టీ మారితే తప్పెలా అవుతుంది?

ప్రజాశక్తి-మంగళగిరి : ఓటమి భయంతో వైసీపీ మూకలు హింసా రాజకీయాలు చేస్తూ పేట్రేగిపోతున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు విమర్శించారు. ఈ మేరకు ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. అధికారమదంతో టీడీపీ కార్యకర్తపై దాడులు తెగబడుతున్నారని, పల్నాడు జిల్లా పెదకూరపాడు వైసీపీ కార్యాలయం తగలబడిన ఘటనలో టీడీపీ కార్యకర్తలు కంచేటి సాయి, దండ నాగేంద్ర జానీలపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు.  కంచేటి సాయిని అన్యాయంగా అరెస్ట్ చేశారన్నారు. వైసీపీ నేతలే కార్యాలయాన్ని తగలబెట్టి ఆ నెపాన్ని తెలుగుదేశంపై మోపడం దుర్మార్గమన్నారు.  రాజకీయ లబ్ధి కోసం ఎంతకైనా దిగజారడంలో వైసీపీ నేతలు …జగన్ రెడ్డిని మించిపోయారనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. పెదకూరపాడు ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు నుంచి కంచేటి సాయికి ప్రాణహాని ఉందని, గతంలో ఎమ్మెల్యే అనుచరుడిగా పనిచేసిన సాయి వైసీపీ ఆగడాలు, వేధింపులు తట్టుకోలేక టీడీపీ కండువా కప్పుకున్నాడని తెలిపారు. అప్పటినుంచి ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు సాయిపై కక్ష కట్టారని, సాయి ఇంటిపైన ఎమ్మెల్యే కుమారుడు కల్యాణ్ దాడి కూడా చేశారని విమర్శించారు. అయినా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం దేనికి సంకేతం? జగన్ రెడ్డిని ఓటమి భయం వెంటాడుతోందన్నారు. ప్రజాగళం సభకు వచ్చాడన్న కారణంగా గిద్దలూరుకు చెందిన మునయ్యను వైసీపీ రౌడీలు నరికి చంపారని,  ఆళ్లగడ్డలో ఇమాన్ అనే యువకుడిని బలితీసుకున్నారని, మాచర్లలో టీడీపీ కార్యకర్త సురేష్ కారు తగలబెట్టారని వెల్లడించారు. ప్రజాస్వామ్యాన్ని పాతరేసి హింసా రాజకీయాలు చేస్తున్న జగన్ రెడ్డికి ఈ ఎన్నికల్లో ఓటమి తప్పదని హెచ్చరించారు. పోలీసులు ఇప్పటికైనా బాధితులకు అండగా నిలబడాలని అకారణంగా టీడీపీ క్యాడర్ పై దాడులు చేస్తున్న వైసీపీ రౌడీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

➡️