ఐఅండ్పిఆర్ కమిషనరు తుమ్మా విజయ్ కుమార్రెడ్డి
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : జర్నలిస్టుల ఇళ్ల స్థలాల భూసేకరణ ప్రక్రియ వేగవంతం చేయనున్నామని, ఇందుకోసం రెండు, మూడు రోజుల్లో బడ్జెట్ విడుదల చేయనున్నట్లు సిసిఎల్ఎ అధికారులు వెల్లడించారని ఐఅండ్పిఆర్ కమిషనరు తుమ్మా విజయ్ కుమార్రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సిఎం క్యాంపు కార్యాలయంలో కలెక్టర్లతో జరిగిన కాన్ఫరెన్స్లో ఇళ్ల స్థలాలకు సంబం ధించిన భూసేకరణ చేసేటప్పుడు జర్నలిస్టుల అభిప్రాయాలను తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అనువైన ఇళ్ల స్థలాలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతోందన్నారు. భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లకు ముఖ్యమంత్రి కార్యదర్శి రేవు ముత్యాలరాజు ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. జర్నలిస్టుల నుంచి 10,017 దరఖాస్తులు అందాయన్నారు. జిఓలోని నిబంధనల మేరకు 7,651 మంది అర్హులైన జర్నలిస్టుల జాబితాను పరిశీలన కోసం జిల్లాల కలెక్టర్లకు పంపామన్నారు. అసంపూర్తిగా ఉన్న 766 మంది దరఖాస్తులను సరిదిద్దుకునేందుకు జర్నలిస్టులకు మరో అవకాశం కల్పించామని, ఈ విషయం ఇప్పటికే సంబంధిత జర్నలిస్టులకు సందేశాలు పంపామని తెలిపారు. వివరాలు సరిచేసుకున్న అనంతరం వాటిని కూడా పరిశీలించి కలెక్టర్లకు పంపుతామన్నారు.