ప్రజాశక్తి-అమరావతి : తప్పుడు ప్రచారాలతో రాజకీయ లబ్ధిపొందడం జగన్కు అలవాటేనని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విమర్శించారు. తప్పుడు ప్రచారంతో, అవాస్తవాలతో రాజకీయ లబ్ధిపొందే ప్రయత్నం, నీచమైన తీరు వారి డీఎన్ఏలోనే ఉందని ఆరోపించారు. పెన్షన్లు పంచవద్దని టిడిపి ఎక్కడా అభ్యంతరం చెప్పలేదని పేర్కొన్నారు. ఇంటింటికీ పెన్షన్ ఇవ్వకూడదని ఎన్నికల సంఘం కూడా ఎక్కడా ఆదేశించలేదని తెలిపారు. పెన్షన్ల విషయంలో జరుగుతున్నది అంతా పెద్ద రాజకీయ కుట్రన్నారు. తన రాజకీయ ప్రయోజనాల కోసం వృద్ధులు, వికలాంగులను కూడా ఇబ్బందులు పెట్టే పాలకులు మనకు అవసరం లేదని తేల్చి చెప్పారు. ప్రజలారా కుట్రలను చేదించండి అని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి రాగానే పెన్షన్ను రూ. 4 వేలకు పెంచి, ఆంక్షలు ఎత్తివేసి ఇంటివద్దే పెన్షన్ అందిస్తామని హామీ ఇచ్చారు.