ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :’కౌలు రైతులకు న్యాయం చేయాలని ఎపి కౌలు రైతు సంఘం డిమాండ్ చేసింది. రైతు భరోసా పొందడానికి భూ యజమానులకు లేని నిబంధనలను కౌలు రైతేలకు విధించారని, రాష్ట్రంలో 15 లక్షల మంది కౌలు రైతులుండగా.. కేవలం లక్ష మందికే రైతు భరోసా అందించారని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు వై రాధాకృష్ణ, ఎం హరిబాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆదివారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. కౌలు రైతులకు భరోసా అందేలా చట్టంలో సవరణలు చేసి, గ్రామ సభల ద్వారా పంట సాగుహక్కు పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే కౌలు రైతులను ఆదుకోవటానికి ప్రత్యేక మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరారు. కౌలు రైతులకు న్యాయం జరిగేలా వారందరికీ కార్డులు, రైతుభరోసా, పంట రుణాలు అందించాలని డిమాండ్ చేశారు. సచివాలయ పరధిలో అధికారుల ద్వారా గ్రామ సభలు నిర్వహించి కార్డులు అందించాలన్నారు.