ప్రజాశక్తి – రాయదుర్గం : రానున్న అసెంబ్లీ ఎన్నికలలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల నుంచి తాను, తన కుటుంబ సభ్యులు ఎన్నికల బరిలో ఉంటామని రాష్ట్ర ప్రభుత్వ విప్, రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి చెప్పారు. అమరావతిలో తాను వైసిపికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అనంతరం బుధవారం రాయదుర్గంలోని తన నివాసంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తొలుత తనకు కళ్యాణదుర్గం అసెంబ్లీ టికెట్ ఇస్తామని చెప్పిన అధిష్టానం అనంతరం టికెట్ ఇవ్వడం లేదని చెప్పిందన్నారు. దీంతో నిరాశ చెందానని తెలిపారు. తాను స్వతంత్ర అభ్యర్థిగానైనా కళ్యాణదుర్గంలో పోటీలో ఉండాలని నిర్ణయించుకున్నానని చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుండి టికెట్ వచ్చినా కళ్యాణదుర్గం నుంచి పోటీకి సిద్ధమన్నారు. సిడబ్ల్యూసి సభ్యులు రఘువీరారెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసినట్లు చెప్పారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర హౌసింగ్ డైరెక్టర్ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.