దగా చేసిన మోడీ

Mar 18,2024 08:20 #BJP, #coments, #CPM AP, #cpm v srinivasarao, #YCP
  • విమర్శలపై జగన్‌ స్పందించాలి
  • సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : చిలకలూరిపేట సభలో ప్రధాని వ్యాఖ్యలు వట్టిమాటల జడివాన తప్ప ఈ రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తామో చెప్పలేదని, వికసిత ఆంధ్రప్రదేశ్‌ డబ్బా కొట్టడం తప్ప ఇప్పటి వరకు ఏం చేశారో, వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తారో చెప్పలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు విమర్శించారు. ఈ మేరకు ఆదివారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో సమస్యల గురించిగానీ ఆఖరికి చిలకలూరిపేటకు కూతవేటు దూరంలో ఉన్న అమరావతి గురించి కూడా ప్రస్తావించకపోవడంతో మోడీ విద్రోహం బయటపడిందన్నారు. తెలుగులో మాట్లాడితే పొంగిపోతారని భావించారు తప్ప నిర్దిష్టమైన హామీలు ప్రకటించలేదని, జగన్‌ నవరత్నాలు వల్లెవేసినట్లు మోడీ పథకాలను వల్లెవేశారని తెలిపారు. పదేపదే డబుల్‌ ఇంజన్‌ సర్కారు అని చెబుతున్నారని, ఇది డబుల్‌ ఇంజన్‌ కాదని, డబుల్‌ నాటక సర్కారని విమర్శించారు. తెలుగుదేశం పార్టీతో జతకడుతూనే జగన్‌ ప్రభుత్వాన్ని మోస్తున్న సర్కారని, 11 విద్యా సంస్థలు ఇచ్చానని చెప్పిన మోడీ ప్రహరీలు కూడా పూర్తికాలేదనే విషయం తెలియదా? అని ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా రైతులు ఆందోళనలు చేస్తున్నా గిట్టుబాటు ధర గురించి ప్రస్తావించలేదని, పోర్టులు, బ్లూ ఎకానమీ అంటే ఆంధ్ర వనరులను అదానీకి అప్పనంగా కట్టబెట్టడమేనా అని విమర్శించారు. ఆయుష్మాన్‌ భారత్‌ పేరుతో 1.20 కోట్ల మందికి ఆరోగ్యం అందించామని చెప్పడం పచ్చి బూటకమని పేర్కొన్నారు. దానినే పదేపదే చెప్పుకోవడం సిగ్గుచేటని, ప్రజల ఆరోగ్యం డేటాతో ఫార్మా కంపెనీలను ఉద్దరించడానికే ఆయుష్మాన్‌ భారత్‌ను తెచ్చారన్నది నగసత్యమని పేర్కొన్నారు. బాబూ, పవన్‌ మోడీని పొగడటానికే సరిపోయిందని, మోడీ మరలా ప్రధానయితే ఈ రాష్ట్రానికి ఏం చేస్తారో, ఏం కావాలో చెప్పలేకపోయారని, మోడీ విజనే తన విజనని చంద్రబాబు చెప్పడం ద్వారా తనకు ప్రత్యేక విజన్‌ లేదని తేలిపోయిందని పేర్కొన్నారు. ఎన్‌టిఆర్‌ను పొగిడితే చప్పట్లు కొట్టారని, అదే ఎన్‌టిఆర్‌ బాబ్రీ మసీదును కూలగొట్టడాన్ని వ్యతిరేకించారని, ఫెడరలిజాన్ని కాపాడటం కోసం నిలబడ్డారని, అవన్నీ మరిచిపోయి లౌకికవాదాన్ని పెకిలించే మోడీ సరసన చేరడం సిగ్గుచేటని పేర్కొన్నారు. మోడీ విమర్శలన్నీ ఇండియా బ్లాకుమీదే ఎక్కుపెట్టారని, దేశ వ్యాప్తంగా ఇండియా బ్లాకుకు వస్తున్న ఆదరణ చూసి మోడీ తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. టిడిపి, జనసేన, బిజెపి పొత్తు వినాశనకరమైందని, ఆంధ్రప్రదేశ్‌ను ధ్వంసం చేస్తుందని పేర్కొన్నారు. తెలుగు ప్రజలు మోడీ చేసిన అన్యాయాన్ని మర్చిపోరని, ప్రశ్నిస్తారని, బిజెపితో పొత్తును టిడిపి శ్రేణులూ ప్రశ్నించాలని కోరారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వం అవినీతి ప్రభుత్వమని మోడీ చేసిన వ్యాఖ్యలపై జగన్‌ స్పందించాలని కోరారు. లౌకికవాదులు, ప్రజాస్వామ్యవాదులు, అభివృద్ధిని కోరుకునేవారు, వామపక్షాలను ఇండియా బ్లాకును ఓట్లువేసి గెలిపించాలని, రాష్ట్రానికి అన్యాయం చేసిన బిజెపికి సున్నా చుట్టి పంపించాలని సిపిఎం రాష్ట్ర కమిటీ తరపున రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

➡️