ప్రజాశక్తి – చీరాల (బాపట్ల) : చీరాల మండలం ఈపురిపాలెం గ్రామంలో యువతి హత్య ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం ఈపురుపాలెం సంఘటన స్థలానికి బాపట్ల పార్లమెంట్ సభ్యులు తెన్నేటి కృష్ణ ప్రసాద్ చేరుకొని ఘటనకు గల కారణాలను డీఎస్పీ ప్రసాద్ ను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎంపీ ప్రసాదుతో ఎంఎస్పి, ఎమ్మార్పియస్ శ్రేణులు బాధితులను పరామర్శించి బాధిత కుటుంబానికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. నేరం జరిగిన తీరును గురించి చీరాల డిఎస్పి బేతపూడి ప్రసాద్ కు కేసు దర్యాప్తు విషయంలో ఎంపి కృష్ణ ప్రసాద్ పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపితోపాటు బాపట్ల జిల్లా ఎంఎస్పి అధ్యక్షులు బుడంగుంట్ల లక్ష్మీ నరసయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ బాపట్ల జిల్లా అధ్యక్షులు దుడ్డు వందనం మాదిగ, పవన్, వంశి, చైతన్య లు ఉన్నారు. ఆ తరువాత మాజీ ఎమ్మెల్యే కరణం బలరామకృష్ణమూర్తి కూడా బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.