ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : శ్రీరామనవమి సందర్భంగా జనసేన తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులకు బి- ఫారాలను ఆ పార్టీ అధినేత పవన్కల్యాణ్ అందజేశారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో బుధవారం బి-ఫారమ్స్ అందించే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పవన్కల్యాణ్ మాట్లాడుతూ.. ఈ ఎన్నికలు చాలా కీలకమైనవన్నారు. ఎన్నో ఒత్తిళ్లు ఎదురైనా ఎదుర్కొని కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ధృడ సంకల్పంతో ఏర్పడిన కూటమికి రానున్న ఎన్నికల్లో ప్రజలు పట్టం కడతారని ఆశిస్తున్నట్లు పవన్కల్యాణ్ ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులని, వారికి పూర్తి స్థాయిలో జవాబుదారీతనం వహించేలా పాలన ఉంటుందని అన్నారు. జనసేన పిఎసి ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. రాష్ట్ర భవిష్యత్తు కోసం వైసిపి విముక్త ఆంధ్రప్రదేశ్ లక్ష్యంతో కొన్ని కోణాల నుంచి ఆలోచించి పవన్కల్యాణ్ అభ్యర్థులను ఎంపిక చేశారన్నారు. అనంతరం బి-ఫారమ్స్ తీసుకున్న అభ్యర్థులతో రాష్ట్రాభివృద్ధికి అహర్నిశలూ పాటుపడతామని ప్రతిజ్ఞ చేయించారు.