ఏలూరు : ఉపాధ్యాయ ఉద్యమ నేత శాసనమండలి సభ్యులు షేక్ సాబ్జి అంతిమయాత్ర ఆదివారం ఏలూరులో ప్రారంభమైంది. ఈ సందర్భంగా … ఏలూరుకు వెళ్లిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు, పలువురు పార్టీ నేతలు, కార్యకర్తలు సాబ్జికి నివాళులర్పించారు.
ప్రభుత్వ లాంఛనలతో అంత్యక్రియలు నిర్వహించాలని కలెక్టర్ ప్రసన్నవెంకటేష్ ఉత్తర్వులు జారీచేశారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు చేపట్టారు. సాబ్జీ కుమార్తె ఆస్రిఫా అమెరికా నుంచి ఆదివారం ఉదయం ఏలూరుకు రావడంతో సాబ్జీ అంత్యక్రియలకు కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం 10 గంటలకు ఆశ్రం ఆస్పత్రి నుంచి నేరుగా సాబ్జీ భౌతికకాయాన్ని ఏలూరులోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయానికి తరలించారు. అక్కడ కొద్దిసేపు ఉంచి, అనంతరం ప్రజల సందర్శనార్థం కలెక్టరేట్ ఏదురుగా ఉన్న ఇండోర్ స్టేడియానికి తీసుకెళ్లారు. ఈ అంతిమ వీడ్కోలులో పలువురు ప్రముఖలు పాల్గొన్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో పాటు సిపిఎం నాయకులు, ఎమ్మెల్సీలు ఐ.వెంకటేశ్వరరావు, కె.లక్ష్మణరావు, మాజీ ఎమ్మెల్సీ వి.బాలసుబ్రమణ్యం, యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు, సిఐటియు, ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులతో పాటు పలు ప్రజాసంఘాలకు చెందిన నాయకులు, జిల్లా ఉన్నతాధికారులు ఆయన భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఈరోజు సాయంత్రం మూడు గంటలకు సంతాపసభ నిర్వహించనున్నారు.