రేపు రాష్ట్రానికి రాహుల్‌ గాంధీ

May 10,2024 08:42 #paryatana, #Rahul Gandhi

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత రాహుల్‌ గాంధీ రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 11న కడప జిల్లాలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ఎపిసిసి అధ్యక్షులు వైఎస్‌ షర్మిలతో కలిసి పాల్గనబోతున్నారు. ఈ మేరకు గురువారం విజయవాడలోని ఆంధ్రరత్న భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎపి వ్యవహారాల ఇన్‌ఛార్జి మాణిక్కం ఠాగూర్‌ వివరాలు వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు విజయవాడలోని జింఖానా గ్రౌండ్స్‌లో ఇండియా వేదిక భారీ బహిరంగ సభ జరుగనుందని, ఈ సభలో ముఖ్య అతిథులుగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున్‌ ఖర్గే, సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి రాజా, తదితరులు పాల్గంటారని చెప్పారు. అలాగే మే 11న కడప సభకు రాహుల్‌ గాంధీ హాజరవుతారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగే అవినీతి, అక్రమాలు, ల్యాండ్‌, శాండ్‌, భూ కబ్జాలు మోడీకి కనపడలేదా? అని ఆయన ప్రశ్నించారు. కాగా, శుక్రవారం సభకు సంబంధించి కరపత్రాన్ని ఆయన ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఎపిసిసి ఎన్నికల పరిశీలకులు మనోజ్‌ చౌహాన్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు వి గురునాథం, కొలనకొండ శివాజీ, ఎస్‌ఎన్‌ రాజా, ఖుర్షిదా తదితరులు పాల్గొన్నారు.

➡️