ప్రజాశక్తి-గ్రేటర్ విశాఖ బ్యూరో : దేశానికి బిజెపి ఎన్డిఎ కూటమి పనికి రాదని ప్రభుత్వ రంగ పరిశ్రమలు రక్షణకు, యువత ఉపాధి, ఏపీ కి ప్రత్యేక హోదా కావాలంటే ఇండియా వేదిక ఆధ్వర్యంలో ఉన్న కాంగ్రెస్ సిపిఎం సిపిఐ ల అభ్యర్థులను గెలిపించాలని ఏపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వై ఎస్ షర్మిల, సిపిఎం రాష్ట్ర నాయకులు సి హెచ్ నరసింగరావు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం 11 గంటలకు కాంగ్రెస్ పార్టీ ఏపీ న్యాయ యాత్ర విశాఖ జిల్లాలో పోటీలో ఉన్న కాంగ్రెస్ ఎంపీ, ఎమ్ ఎల్ ఏలు, సిపిఎం సిపిఐ ఎమ్ ఎల్ ఎ లను గెలిపించాలను కోరుతూ… విశాఖపట్నం లోని అక్కయ్యపాలెం మహారాణి పార్లర్ వద్దకు షర్మిల నేతృత్వంలో విచ్చేసింది. ఈ సందర్బంగా భారీ సంఖ్యలో తరలి వచ్చిన సభికులనుద్దేశించి షర్మిల మాట్లాడుతూ … విశాఖ ఎంపీ గా 2019 లో గెలిపించిన వైసీపీ వ్యక్తి భూ కబ్జాలతో ఎంపీ పదవిని భ్రష్టు పట్టించారని విమర్శించారు. విశాఖ ఎంపీ గా సత్యారెడ్డి ని గెలిపిస్తే ప్రజల తరపున పార్లమెంట్ లో పోరాడతారని బులుసు సత్యనారాయణ రెడ్డి ని సభకు ఆమె పరిచయం చేశారు. రాష్ట్రంలో జగన్ గత ఎన్నికల్లో మేనిఫెస్టో లో చెప్పినవేవి అమలు చేయలేదని దానికి ఏ విలువ లేదన్నారు. 42 నీటి పారుదల ప్రాజెక్టు లను నవ రత్నల్లో పెట్టి ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. మద్యనిషేధం హామీని తుంగలో తొక్కారన్నారు.. రాష్ట్రంలో 3 రాజధానులని చెప్పి విశాఖలో కూడా రాజధాని పెట్టలేకపోయారని అన్నారు. రాజధాని రాలేదు జగన్ పాలనలో ప్రజలకు చిప్ప చేతికొచ్చిందన్నారు. స్పెషల్ స్టేటస్ విషయంలో చంద్రబాబు, జగన్ ఇద్దరూ విఫలం అయ్యారని కాంగ్రెస్ తోనే హోదా సాధ్యమన్నారు. గంగవరం పోర్టును ప్రభుత్వంలో కలిసేలాగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి అగ్రిమెంట్ చేస్తే అయన కొడుకయిన జగన్ ఆదానికి అమ్మేయడం దారుణమన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సంక్షోభానికి గంగవరం అదాని పోర్టు కారణమని షర్మిల చెప్పారు.
సిపిఎం రాష్ట్ర నేత సిహెచ్ నరసింగరావు మాట్లాడుతూ షర్మిల న్యాయ యాత్రతో కాంగ్రెస్ లో రాష్ట్రంలో జవసత్వాలు వచ్చాయని దేశంలో బీజేపీ కూటమి ఓటమి చెందిన ఇండియా వేదిక అధికారం లోకి రావాలన్నారు. రైల్వే జోన్ రాలేదని స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో పడినా పాలకులకు పట్టడం లేదన్నారు..10 ఏళ్లుగా రాష్ట్రాన్ని చంద్రబాబు జగన్ పాలించి నాశనం చేసారన్నారు.. ఈ కార్యక్రమం లోగాజువాక సిపిఎం ఎం ఎల్ ఏ అభ్యర్థి ఎమ్ జగ్గునాయుడు, సిపిఐ పశ్చిమ ఎమ్ ఎల్ ఏ అభ్యర్థి విమల, కాంగ్రెస్ పార్టీ ఉత్తరం, దక్షిణం, తూర్పు, శఅంగవరపుకోట అభ్యర్థులంతా ప్రసంగించారు.. సభకు కాంగ్రెస్ విశాఖపట్నం ఎంపీ అభ్యర్థి సత్యారెడ్డి అధ్యక్షత వహించారు..