టిడిపి నాయకుల ధర్నా
ప్రజాశక్తి-తిరుపతి టౌన్ : తిరుపతి అర్బన్ ఎస్పి మల్లికా గర్గ్ను అక్రమంగా బదిలీ చేశారంటూ టిడిపి నాయకులు సోమవారం ఆందోళన చేశారు. టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జి సుగుణమ్మ ఆధ్వర్యంలో నగరంలోని టౌన్క్లబ్ వద్ద నిర్వహించారు. అర్బన్ ఎస్పిగా మల్లికా గర్గ్ను కొనసాగించాలని డిమాండ్ చేశారు. అయితే అప్పటికే అక్కడ ఉన్న పోలీసులు వారిని అరెస్టు చేసి వెస్ట్ స్టేషన్కు తరలించారు. అనంతరం సొంతపూచీకత్తుపై వారిని విడుదల చేశారు. ఈ సందర్భంగా సుగుణమ్మ మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో వైసిపి ప్రజాప్రతినిధులు దొంగ ఓట్లతో గెలిచేందుకే ఎస్పిని బదిలీ చేయించారని విమర్శించారు. మల్లికాగర్గ్ నిజాయతీ గల పోలీసు ఆఫీసర్ కావడంతో వైసిపి అక్రమాలకు అడ్డకట్ట వేస్తారని ముందస్తుగా ఆమెను బదిలీ చేశారన్నారు. ఈ ధర్నాలో టిడిపి, జనసేన కార్యకర్తలు పాల్గన్నారు.