పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి 14న స్పెషల్‌ క్యాజువల్‌ లీవ్‌

ఎన్నికల కమిషన్‌
ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఈనెల 13న జరిగే పార్లమెంట్‌, శాసనసభ ఎన్నికల్లో పోలింగ్‌ విధులు నిర్వహించే సిబ్బందికి ఆ మరుసటి రోజు (14వ తేదీ) ప్రత్యేక క్యాజువల్‌ లీవ్‌ (ఆన్‌డ్యూటీ ) సౌకర్యాన్ని కల్పిస్తున్నట్లు సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం సంబంధిత లీవ్‌ శాంక్షనింగ్‌ అథారిటీలు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. 13న ఎన్నికల విధుల్లో పాల్గనే సిబ్బందికి మరుసటి రోజు క్యాజువల్‌ లీవ్‌గా పరిగణించాలని ఎపి ఎన్‌జిఓ, ఎపి జెఎసి ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిఇఓ స్పష్టం చేశారు. పోలింగ్‌ విధులు నిర్వహించే ప్రిసైడింగ్‌ అధికారులు (పిఓ) అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు (ఎపిఓ) ఇతర పోలింగ్‌ సిబ్బంది (ఒపిఓ)కి 14న ప్రత్యేక క్యాజువల్‌ లీవ్‌ వర్తిస్తుందని తెలిపారు. పోలింగ్‌ విధులకు హాజరై రిజర్వుడు సిబ్బందిగా ప్రిసైడింగ్‌, అసిస్టెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారులు, ఇతర పోలింగ్‌ సిబ్బందిగా డ్రాఫ్టు చేయబడిన వారికి ఈ ప్రత్యేక క్యాజువల్‌ లీవ్‌ వర్తించదని సిఇఓ ముఖేష్‌కుమార్‌మీనా పేర్కొన్నారు. వాస్తవంగా ఎవరైతే పోలింగ్‌ విధులు నిర్వహిస్తారో వారికి మాత్రమే ఈ లీవ్‌ వర్తిస్తుందన్నారు. జిల్లా ఎన్నికల అధికారులు ఈ ఆదేశాలను రిటర్నింగ్‌ అధికారులకు తెలియజేయాలని, 13న పోలింగ్‌ అనంతరం నిర్దేసిత కేంద్రంలో పోలింగ్‌ సామాగ్రిని అందజేసిన అనంతరం పిఓ, ఎపిఓ, ఒపిఓలకు డ్యూటీ సర్టిఫికెట్లను జారీ చేసి, 14న ఈ ప్రత్యేక క్యాజువల్‌ లీవ్‌ను వినియోగించుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సిఇఓ ఆదేశించారు. అందరూ కార్యదర్శులు, శాఖాధిపతులు, జిల్లా ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్న కలెక్టర్లు సంబంధిత లీవ్‌ శాంక్షనింగ్‌ అథారిటీలకు తమ ఆదేశాలను సర్క్యులేట్‌ చేసి, పోలింగ్‌ విధులు నిర్వహించిన వారికి ప్రత్యేక క్యాజువల్‌ లీవ్‌ పరిగణించే విధంగా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

➡️