– అదానీ పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
ప్రజాశక్తి-అమరావతి :గంగవరం పోర్టు నిర్వాసిత కార్మికులతో సమస్యల పరిష్కారం కోసం విశాఖ జిల్లా యంత్రాంగం, పోలీసు కమిషనర్ సమక్షంలో చర్చలు జరపాలని గంగవరం అదానీ పోర్టు యాజమాన్యాన్ని హైకోర్టు ఆదేశించింది. విచారణను ఈ నెల 30కు వాయిదా వేస్త్తూ జస్టిస్ ఎన్ జయసూర్య శుక్రవారం ఆదేశాలిచ్చారు. నిర్వాసిత కార్మికుల సమ్మె నేపథ్యంలో అదానీ గంగవరం పోర్టు నుంచి విశాఖ స్టీల్ ప్లాంటుకు బగ్గు సరఫరాకు ఇబ్బందులు లేకుండా ఆదేశాలివ్వాలంటూ విశాఖ స్టీల్ ఎగ్జిక్యూటివ్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ కె వెంకట దుర్గాప్రసాద్ పిటిషన్ దాఖలు చేశారు. వివాద పరిష్కారానికి ఎలాంటి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారో చెప్పాలని హైకోర్టు ఆదేశించింది. స్థానికంగా ఉన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు తీసుకున్న చర్యలను వివరించాలంది. కేసుల నమోదు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీస్ కమిషనర్ను ఆదేశించింది.