ముషీరాబాద్ (తెలంగాణ) : హైదరాబాద్లోని ముషీరాబాద్లో జిహెచ్ఎంసి అధికారులు దళితుల ఇళ్లను కూల్చివేయడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. గాంధీనగర్ డివిజన్లోని స్వామి వివేకానంద నగర్లో కొందరు దళితులు దాదాపు 70 ఏళ్లుగా ఇళ్లను నిర్మించుకొని నివాసముంటున్నారు. సోమవారం ఉదయం ఎంఆర్ఒ, అధికారులు తమ సిబ్బందితో వచ్చి అకస్మాత్తుగా దళితుల ఇళ్లను కూల్చివేశారు. కేసు కోర్టులో పెండింగ్లో ఉన్నప్పటికీ అధికారులు బలవంతంగా పోలీసు బందోబస్తుతో వచ్చి ఇండ్లను కూల్చివేశారు. స్థానికులు ఆందోళనలు నిర్వహించే అవకాశం ఉండటంతో ముందస్తు భద్రతా చర్యలు చేపట్టి కూల్చివేతలను ప్రారంభించారు. బస్తీలోని స్థానికులను ఎవరిని కూడా అనుమతించడం లేదు. ధరణి విచారణ కమిటీ ఛైర్మన్ కోదండ రెడ్డి ఘటనా స్థలానికి వచ్చి బాధితులను పరామర్శిస్తున్న సమయంలో పోలీసులు ఆయన్ను నెట్టివేశారు.
బాధితులు మాట్లాడుతూ … మొత్తం 23 దళిత కుటుంబాలు గత 70సంవత్సరాలుగా ఇక్కడే నివాసము ఉంటున్నామని చెప్పారు. వచ్చే నెల అంటే ఫిబ్రవరి 6వ తేదీన హైకోర్టులో కేసు పెండింగ్ లో ఉన్నప్పటికీ అధికారులు తమ ఇండ్లను కూల్చివేస్తున్నారని బస్తీ వాసులు వాపోయారు. ఇళ్లలో సామాన్లు ఉన్నాయని చెబుతున్నా వినడం లేదని కంటతడిపెట్టారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ కొందరు బాధితులు పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా.. పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. భారీ పోలీసు బందోబస్తు నడుమ ఇళ్ల కూల్చివేత కొనసాగడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.